రచన: చందు తులసి
‘ఆంధ్రజ్యోతి‘, 4 అక్టోబర్ 2015
కథాసాహితి ‘కథ-2015‘ సంకలనం
“మనిషి పుట్టుక పుట్టిన తర్వాత కొంచెమన్నా సిగ్గూ రోషం ఉండాల. మాట మీద నిలబడాల. అప్పు తీసుకునేటపుడు తియ్యని ముచ్చట్లు ఎన్ని సెప్పావు. తీరా అప్పు కట్టమంటే మాత్రం పిట్టకథలు శానా సెపుతున్నావు. అంత సేత కాకపోతే ఎవరు నిన్ను అప్పు తీసుకోమన్నాడు? నేనేం నీ ఇంటికి కొచ్చానా? నువ్వే కదా పదిసార్లు నా ఇంటి చుట్టూ తిరిగావు! పోయినేడాది ఏమన్నావు? వచ్చే ఏడాది కడతా సేటూ అన్నావు. మరి కట్టావా? దొంగోని మాదిరి తప్పించుకొని తిరుగుతున్నావు. నిన్ను పట్టుకోవడం చానా కష్టమపోయింది“
“నిజమే సేటు గారూ…. కానీ, ఇప్పటికిప్పుడు తీర్చమంటే ఎట్లా తెచ్చేది” నసిగాడు నారాయణ.
“ఎట్టా తీరుస్తానని తీసుకున్నావయ్యా అప్పు? ఎట్టా తీర్సేది కూడా నేనే సెప్పాల్నా! నీ పెండ్లాన్ని పంపురా సెపుతా….”
పొద్దున అప్పు వసూలు కోసం వచ్చిన సేటు అన్న మాటలే మళ్లీమళ్లీ వినిపిస్తున్నాయి నారాయణకు.
“ఎన్ని మాటలన్నాడు! వాడేం ఉత్తపుణ్యానికిచ్చాడా? నూటికి ఐదు రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాడు కదా. నేనేం అప్పు ఇయ్యనన్నానా?” అనుకున్నాడు నారాయణ గబగబా నడుస్తూ.
కాసేపట్లోనే ఊరవతల ఊడల మర్రి చెట్టు కిందకి చేరుకున్నాడు. ఆవేశంలో ఉరి పోసుకుందామని వచ్చాడు కానీ తాడు తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఇప్పుడెట్టా? చెట్టువైపు చూశాడు. జడలు విరబోసుకున్న బ్రహ్మరాక్షసి మాదిరి ఉంది ఆ మర్రి చెట్టు.
జాగ్రత్తగా చెట్టు వైపు చూసి ఉలిక్కిపడ్డాడు.
ఒక్కటి కాదు, రెండు కాదు కొమ్మ కొమ్మకో ఉరి తాడు. మొక్కులు తీర్చమని దేవుళ్ల దగ్గర కట్టినట్లు … తాళ్లు … ఉరితాళ్లు.
ఇంకా పైకి చూశాడు. గబ్బిలాలు తలకిందుల్లా వేలాడుతున్నాయి. అవి గబ్బిలాల్లా లేవు. ఆ చెట్టుకు ఉరిపోసుకుని సచ్చిపోయి వేలాడుతున్న ఆత్మల్లా ఉన్నాయి? ఓ తాడు అందుకోబోయాడు. అంతే!
ఏడనుంచి వచ్చాడో సేటు “సచ్చిపోతే అప్పు తీరిపోతుందని చంకలు గుద్దుకుంటున్నావారా? నా అప్పు తీరిస్తే కానీ నిన్ను సావనివ్వను … హహ్హహ్హహ్హ,” వికటాట్టహాసం చేశాడు.
తపో భంగమైన మునుల్లాగా ఉలిక్కి పడ్డాయి గబ్బిలాలు.
కీచ్ కీచ్… కీచ్ కీచ్… వందలాది గబ్బిలాలు భోరున విలపిస్తూ చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి. వాటిని జాగ్రత్తగా చూశాడు నారాయణ. అవి గబ్బిలాలు కాదు. ఆత్మలే. వాటిలో తన తాత ఉన్నాడు. అప్పు తీర్చలేక సచ్చిపోయిన నాయన ఉన్నాడు. గొడ్రాలని నింద తట్టుకోలేక ఉరిపోసుకుని సచ్చిపోయిన ఊర్మిళక్క ఉంది.
వాళ్లే… వాళ్లే గబ్బిలాల్లా తిరుగుతున్నారు.
“తాతా… నాయనా… అక్కా,” కేకలు పెట్టుకుంటూ వాటిని పట్టుకోపోయాడు.
“ఏమైందయ్యా…. ఏందా కలవరపాటు!?“భార్య పూలమ్మ కేకలతో కళ్లు తెరిచి చూశాడు.
కల. కలే!
“ఏందయ్యా, పొద్దున్న సేటు గొడవ చేసిన కాన్నుంచి అదోలా ఉన్నావు. నాకేందో భయంగా ఉన్నాది,” ఏడుస్తూ అన్నది పూలమ్మ.
రెండేళ్ల నుంచి అప్పు తీర్చనందుకు పొద్దున్న సేటు వచ్చి ఇంటి ముందు పెద్ద పంచాయతీ పెట్టాడు. మూడు రోజుల్లో అప్పు తీరిస్తే సరేసరి. లేదంటే ఇల్లు వేలం వేసి ఐనా సరే నా అప్పు వసూలు చేసుకుంటానని చెప్పి ఫర్మానా జారీ చేసి పోయాడు.
నారాయణది కొత్త కథ కాదు. కొరగాని కథ.
********
నారాయణ సొంతంగా ఒకే ఒక్క ఎకరం భూమి ఉన్న రైతు. ఒక్క ఎకరం సేద్యంతో మొగుడు సచ్చిన తల్లినీ, మొగడు ఇంకా సావని పెళ్లాన్ని, పిల్లలని సాకేదెట్టా? అందుకే ఇంకో ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. మిగతా రైతుల్లాగే బీటీ పత్తి తప్ప ఇంకో పంట కన్నెత్తి కూడా చూడని రైతు. అసలు పత్తి తప్ప ఇంకో పంట కూడా ఉందన్న సంగతే గుర్తులేని రైతు. ఒక ఏడు పంట కలిసొస్తే ధర కలిసిరాదు. ధర కలిసొస్తే పత్తి వ్యాపారి కలిసిరాడు. సరిగ్గా అలాగే ఈ ఏడాది గింజలు భూమిలో ఏ క్షణాన ఏశాడో కానీ, ఏసిన గింజలు ఏసినట్లు కాకులు, పిట్టలు ఏరకతిన్నై కానీ ఒక్క గింజ మొలవలేదు. “అప్పుడప్పుడు వాన కురుస్తుంది” అని చెప్పుకోవడానికైనా మచ్చుకు ఒక్క చుక్క పడలేదు. ఏం చేయాలి? తెలిసింది ఒక్క సేద్యమే. ఏస్తే గీస్తే మళ్లీ పత్తే వెయ్యాలి.
పంట పండదన్న సంగతి సేటుకు ఎలా తెలిసిందో కానీ ఇంటి ముందు డేగలా వచ్చి వాలాడు. నారాయణ ఒకటి రెండు సార్లు ఇంట్లో ఉండి కూడా లేడని భార్య పూలమ్మతో చెప్పించాడు. ఇవాళ సేటు ఇంకా ఎవరూ నిద్రలేవకముందే వచ్చాడు. వస్తూనే ఇంట్లే సామానంతా బయటకు విసిరేశాడు. ఆ గొడవకు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అందరి ముందే నానా బూతులు తిట్టి పరువు తీశాడు.
నారాయణకు చానా బాగా గుర్తు.. ఆ సేటు అసలు ఈ ఊరివాడు కాదు. ఎక్కన్నుంచో ఒక తరాజు, చెక్కపీట చేతిలో పట్టుకుని వచ్చిండు. ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, సారాయి, కల్తీ ఎరువులు ... ఇలా రకరకాల వ్యాపారాలు చేసి బాగా సంపాదించాడు. సంపాదించిన డబ్బు అప్పులకు ఇచ్చి, దొంగ వడ్డీలు రాసి మరింత పెంచాడు. రైతుల దగ్గర వంగి వంగి దండాలు పెట్టిన కాడ్నించి అదే రైతులను “దొంగ నా…” అనేకాడికి ఎదిగాడు.
నారాయణకు పొద్దున్నించీ ఒకటే ఆలోచన. “సేటు అప్పు ఎలా తీర్చాలి?”
భూమి అమ్మినా యాభైవేలు రాలవు. అప్పేమో దానికి ఆరు రెట్లు.
నారాయణకు దోస్తు జగ్గడు గుర్తొచ్చాడు. జగ్గడిదీ నారాయణదీ ఒకటే ఈడు. వానాకాలం సదువులు కలిసే సదువుకున్నారు. రెండ్రోజులు బడికి మూడు రోజులు యవుసాయానికి. సదువులు మధ్యలోనే మానేసి బర్లు కాశారు. జగ్గడే ఓ సారి ఇంట్లోంచి వాళ్ల నాయిన తాగే సారా సీసా తెచ్చాడు. కంది చేల మధ్యన దాచుకుని మొదటి సారిగా నారాయణ సారా తాగాడు. అప్పటినుంచి జగ్గడు, నారాయణ పండుగలకు పెళ్లిల్లకు తప్పకుండా సారాయి తాగేవాళ్లు.
ఓ రోజు జగ్గడి నాయన అప్పులు తీర్చలేక మర్రి చెట్టు కింద ఉరి పెట్టుకుని చచ్చిపోయిండు. తండ్రి పోయిండు కానీ సేద్యం పోలేదు. అది జగ్గడి మెడకు చుట్టుకుంది. జగ్గడు యవసాయం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. ఒకటీ రెండేళ్లు బానే ఉన్నా పోయిన ఏడాది కాలం కలిసిరాలేదు. బాధతో సారాయికి బానిసగా మారాడు. తాగి తాగి పిచ్చోనిలా మారిపోయాడు. ఓ రోజు తండ్రి చనిపోయిన మర్రిచెట్టుకే అదే కొమ్మకు ఉరి వేసుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో నారాయణ దూరంగా ఎద్దుల మేపుతూ ఉన్నాడు. జగ్గడు చేసే గోరం చూసి గబగబా పైన కింద పడుతూ పరిగెత్తుకొచ్చాడు. కానీ ఈ లోపలే జగ్గడు కాళ్లూ కొట్టుకుని కళ్లు తేలేశాడు.
అప్పట్నుంచీ నారాయణకు కళ్లు తెరిసినా మూసినా ఆ చెట్టే కనిపిస్తోంది. దానికి ఉరిపోసుకుని చనిపోయింది ఒకరో ఇద్దరో కాదు.నారాయణ ఇంట్లోనే ముగ్గురు వాళ్ల తాత, నాయన, పెద్దక్క ఆడనే ఊపిరి వదిలారు.
“ఇంకా పడుకోలేదా?“ఆకాశంవైపు చూస్తూ ఉన్న భర్తను అడిగింది పూలమ్మ. “అప్పు ఎట్ల తీర్చాలే అనే కదా దిగులు. నువ్వేం గుబులు చెడకు. పట్నంల ఉన్న పెద్ద వ్యాపారి సత్నారి సేటు కాడ అప్పు అడిగి చూడయ్యా. ఆయన ఐతే వడ్డీ ఎక్కువ తీసుకున్నా, రెండు మూడేళ్లు ఆగుతడు”
“మరి పంట రాకుంటే ఎట్ల తీరుస్తం,” అనుమానించాడు నారాయణ.
“కాలం ఎప్పుడూ ఒక్క తీర్గే ఉండదు కదయ్యా. ఏమో, వచ్చే ఏడాది కాలం కాకపోతదా? పంటలు పండకపోతయా, మన అప్పులు తీరకపోతయా. అడవిల మోదుగులు బతుకుతున్నయి. మనం బతకలేమా?” భరోసా ఇచ్చింది పూలమ్మ.
********
పొద్దున్నే లేచి టవునుకు వెళ్లాడు నారాయణ.
సత్నారి సేటు అప్పు వసూలుకు వేరే ఊరు పోయిండట. పన్నెండింటికి వస్తడు అన్నది సేటు భార్య. ఇంటి ముందలనే కూచుండు నారాయణ. అటు పోయి, ఇటు పోయి ఒంటి గంట దాటింది. ఐనా సత్నారి సేటు రాలే.
పొద్దున బస్సు అందుకోవాలన్న ఆరాటంలో రాత్రి మిగిలిన బువ్వ తిని వచ్చిండు నారాయణ. ఆకలయ్యింది.
లేచి ఏమన్నా తిందామని హోటల్ దిక్కుకు పోయిండు.
“నారాయణన్న బాగున్నవా?“ఎవరో పలుకరించేసరికి అటువైపు చూసిండు.
“నేనే అన్నా, వెంకటమ్మను. మాలపల్లె“
“ఆ, ఆ… పెద్ద రాములు బిడ్డవు కదా. మొగడు సచ్చిపోయే. తల్లిదండ్రి సచ్చిపోయినంక మల్ల కానరావైవితవి. ఎట్లున్నవు?“
“నేను గట్లనే ఉన్న అన్న. ఇదే నా బండి. అన్నం తింటవా?” అని అడిగింది.
మురికి కాలువ పక్కన తోపుడు బండి మీద ఓ గిన్నెలో అన్నం, మిగిలిన గిన్నెల్లో కూర, చారు ఉన్నాయి.
మొగమాటానికి వద్దన్నడు.
“ఏం ఫర్లేదన్నా. పైసలియ్యకుంటే మాయే. నీలాంటి కష్టజీవికి పెడితే పుణ్యంమొస్తది,” అని ఓ ప్లేట్ల ఇంత అన్నం, రెండు చికెన్ ముక్కలు, చారు పోసి ఇచ్చింది. బాగా ఆకలితో ఉన్నాడేమో నారాయణ, రెండు ముద్దలకే అంతా మింగేసిండు. ఇంకొంచెం పెట్టించుకోని తిన్నడు.
“అవు చెల్లె. నీ మగడు జానయ్య నిన్ను మోసం చేసి పోయిండు కదా. ఎటు పోయినవో ఏమై పోయినవో అనుకున్నం“
“ఏ ఏట్లోనో దూకుదామనుకున్నా కానీ నా కడుపుల ఓ నలుసు పడింది. వాన్ని బతికించుకునేటందుకు నిలబడ్డ. మొదట ఈడ హోటల్ల క్లీనింగ్ పనికి చేరి మెల్లగ వంట నేర్చుకున్న. ఇప్పుడు సొంతంగ నేనే ఈ బండి పెట్టిన. ఇప్పుడు రోజు ఐదారొందలు .నాకు నా కొడుక్కు సరిపోతయి. నా కింద ఇంకో ఇద్దరు మనుషులు కూడా ఉన్నరు. నా కొడుకు ఇంజనీరింగ్ సదువుతున్నడు. ఆనిమీద ఆశతోనే బతుకుతున్న”
అన్నం తిని జేబుల చేయి పెట్టిండు నారాయణ. యాభై రూపాయలు ఇచ్చిండు.
“వద్దన్నా,” అన్నది. ఐనా బలవంతంగా చేతిల పెట్టి, “ఎప్పుడన్నా కుదిరితే ఊరికిరా చెల్లె,” అని చెప్పి గబగబ సత్నారి సేటు ఆఫీసుకాడికి బాట పట్టిండు.
వెంకటమ్మ చెప్పింది విన్న తర్వాత నారాయణకు తన బతుకుమీద తనకే అసహ్యం పుట్టింది. “ఆఖరికి రోడ్ల మీద తోపుడు బండ్లు పెట్టుకున్నవాళ్లు కూడా ఆరామ్ గా బతుకుతున్నరు. దేశంల అందరూ సుఖంగానే బతుకుతున్నరు ఒక్క వ్యవసాయం చేసేటోడు తప్ప. అందరూ ఏడాదికో అంతస్తు ఇల్లు కడుతుంటే రైతు మాత్రం ఏడాదికేడాదికి బొందల దిగబడుతుండు,” అనుకున్నడు.
సత్నారి సేటు ఇంకా రాలేదు. కానీ అక్కడకి ఓ యాభై మందిదాకా రైతులు వచ్చిన్రు. అందరిదీ అదే కథ. అప్పు కావాలే. అప్పు
నారాయణకు రాత్రి సరిగా నిద్రరాలేదు. తోపుడు బండి మీద కడుపు నిండ తిన్నడేమో చిన్నగా కన్నుమూత పడింది.
చెట్టు. ఊరవతల ఊడల మర్రిచెట్టు. జుట్టు విరబోసుకుని, కొరివి దయ్యంలా.ఊడలు ఊపుకుంటూ రా…రా… అంటూ.
గబ్బిలాలు. కీచ్ కీచ్. తాళ్లు, ఉరి తాళ్లు … ఊగుతా.
కారు హార్న్ సప్పుడు కావడంతో ఉలిక్కిపడి నిద్రలేచిండు నారాయణ.
సత్నారి సేటు దిగిండు. పోయినేడాది దాకా బైక్ మీద తిరిగేటోడు. కొత్తగా కారు కొన్నడు. బొర్ర కూడా పెరిగింది. రైతులంతా గబగబ దండాలు పెట్టుకుంట పోయినరు, ఒకల తర్వాత ఒకలు. తన వంతు వచ్చినంక పోయి పరిస్థితి అంత చెప్పిండు నారాయణ.
“ఏం తాకట్టు పెడతావ్? బంగారమేమన్నా ఉన్నదా?”
“అంటే … పంట అమ్మినంక నీకే ఇస్త సేటు“
“అరే నారాయణ, ఇప్పుడు పంట మీద అప్పు ఇచ్చే రోజులు పోయినయ్. రైతులు కూడా తెలివిమీరిన్రు. పోనీ ఓ పని చేయ్. భూమి కాయితాలేమన్నా ఉన్నయా?“
నారాయణ కౌలు రైతు . ఉన్నది ఒక్క ఎకరం కానీ దానికీ పట్టాలేదు.
“బంగారం లేదు. భూమిలేదు. ఉన్నదానికి పట్టాల్లేవు. ఏం చూసి అప్పియ్యమంటవు నారాయణా? కనీసం మీరు ఉరి పెట్టుకుని సచ్చినా గవర్మెంటోడు లక్ష రూపాయలిస్తడు. నాకెవడిస్తడు?“ సేటు లేచిపోయిండు.
నారాయణకు కోపం తన్నుకొచ్చింది. ఒకప్పుడు నారాయణ మార్కెట్కు పత్తితో వచ్చినపుడు ఇదే సత్నారి సేటు తన దగ్గరే అమ్మా అయ్యా అని కాళ్లు వేళ్లు పట్టుకుని బతిమాలాడు. “నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత అంటే అంత అప్పు ఇస్తా,” అన్నాడు. రోజులు మారినయ్. మాటలు మారినయ్.
చేసేదేంలేక ఇంటి దారి పట్టిండు నారాయణ.
“అయిపోయింది. అంతా అయిపోయింది. ఉన్న ఒక్క ఆశ జారిపోయింది. రేపు మాపో ఊర్లో సేటు రావడం కాయం. పరువు తీయడం కాయం. దీనికన్నా సావే నయం. పురుగు మందు తాగి సచ్చినా బాగుండు. అది కొందామన్నా జేబుల సరిపోయే పైసలు లేవు,” తిట్టుకుంటా బస్టాండుకు కాళ్లీడ్చుకొచ్చిండు.
ఇంకా బస్సు రాలేదు.
చాయ, చాయ … చాయ్. సమోసా…బిస్కట్లోయ్.
ఏ … పల్లీ బటానీలోయ్.
బస్టాండంతా సందడి.
“అయ్యా పాప్ కార్న్ కావాలా?” ఎక్కన్నో విన్న గొంతు. అటు తిరిగి చూశాడు.
లింగన్న!
వాళ్లూరోడే. వ్యవసాయం దివాళా తీయడంతో పట్నం వచ్చిండు.
“ఏమిరా లింగ. పల్లీ బఠాణీ అమ్ముతున్నావారా!?”
“అవునన్నా..ఆ యవసాయం చేసి అప్పుల పాలయే దానికన్నా ఇదే సుఖంగా ఉందే. రోజుకు ఎంత లేదన్నా రెండు మూడొందలువస్తయి. లాభం రాకున్న పెట్టబడిన్న వస్తది. యవసాయం కన్న వందపాళ్లు నయం. అగో, పట్నం బస్సు వచ్చింది నాలుగు గిరాకిలొస్తయి. పోయొస్త,” అనుకుంట పరుగున పోయిండు.
లింగయ్యది పెద్ద వ్యవసాయం. పదెకరాలపైనే. బోర్లు వేసి వేసి ఐదారు ఎకరాలు అమ్మిండు. ఇంక మిగిలిన భూమి కూడా అప్పులకింద సరిపోయింది. పొట్ట సేతపట్టుకుని పట్నం వచ్చిండు.
“థూ. ఇంత బతుకు బతికి పల్లీ బఠాని అమ్ముతుండు. అదే నేనైతే సిగ్గుతోని సచ్చిపోయేటోన్ని. దాని కన్న మర్రిచెట్టు కింద ఉరిబెట్టుకుంటే నయం,” అనుకున్నడు నారాయణ
ఇంతలో బస్సు రావడంతో ఎక్కి కూర్చున్నడు. చిన్న కునుకు పట్టింది.
మళ్లీ, జడల మర్రిచెట్టు. ఉరి తాళ్లు. గబ్బిలాలు.
తాత. నాన్న.
“రా, రా, రా,” ఊడలు పిలుస్తున్నాయ్.
ఉలికిపడి కళ్లు తెరిచాడు నారాయణ. “దీని తల్లి కన్ను మూస్తే ఆ మర్రిచెట్టే. నాకు ఏదన్న దయ్యం గిట్ట పట్టిందా?జగ్గడు అట్నే నాలుగైదు రోజులు పిచ్చోనిలెక్క అరిచి అరిచి, ఆఖరికి ఆ చెట్టుకే ఉరి పెట్టుకుండు“
బస్సు ఊరికి చేరింది.
ఊరంతా ఒకటే కలకలం.
నర్సిగాడు ఉరి పెట్టుకున్నడట. పొద్దున పట్నం పోయేటపుడు కూడా నారాయణతో మాట్లాడిండు. గబగబ నారాయణ నర్సిగాని ఇంటికి పోయిండు. ఇంటి నిండా జనం.
నిండా ఇరవై ఏళ్లు కూడా లేని నర్సిగాని పెళ్లం శవం మీద పడి గుండెలు బాదుకుంటోంది.
సూడ సక్కని పువ్వుల్లాగా ఉన్న ఇద్దరు బిడ్డలు. ఇంత చిన్న పిల్లల్ని వదిలి ఎవరికైనా చనిపోవాలనిపిస్తదా?
రాత్రికి రాత్రే నర్సయ్య అంత్యక్రియలు పూర్తయినయి.
“బంగారమసోంటి బిడ్డ, నర్సిగాడు.పొద్దున నీ కోసం ఇంటికూడా వచ్చినడు. వానలేక పంట మొత్తం తెర్లయి పోయిందని ఒకటే బాదపడ్డడు,” పూలమ్మ భర్త దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది.
నారాయణకు తినాలని కూడా అనిపించలేదు. కాళ్లమంచం వేసుకుని కూలబడ్డడు.
“ఏందిది? ఎందుకు ఒకని తర్వాత ఒకడు పిట్టలు రాలినట్లు రాలుతున్నరు. దేనికి భయపడి? అప్పు తీరదన్న భయమా? అట్లైతై నర్సిగాడు ఎన్నడో సావాలే! నర్సిగాడు చానా దైర్యస్తుడు. కొమ్ములు దిరిగిన కోడెను కూడా వంచేటోడు. అసలు భయమన్నదే తెలీదు. అర్థరాత్రి, అపరాత్రి ఎక్కడికైనా వెళతాడు. ఎంత లోతు బాయిలో అయినా ఏదన్నా పడిపోతే మునిగి తెచ్చేటోడు. ఆరడుగుల తాచుపామును ఒడుపుగా మెడపట్టుకుని ఆడించేంత ధైర్యమున్న నర్సిగాడు దేనికి భయపడ్డడు? అప్పుకైతే కాదు“
“మన ఇంటి కాడ గొడవచేసినట్లే నర్సిగాని ఇంటికాడ కూడా సేటు గాడు లొల్లి పెట్టిండట. తల్లినీ, పెళ్లాన్నీ అనరాని మాటలన్నడట,” పూలమ్మ చెప్తోంది.
నారాయణకు అర్ధమైంది. నర్సిగాడు పరువుకు భయపడ్డడు. ఇంత కాలం బతికి, ఇప్పుడు పదిమంది ముందు నామోషి అవుతాందని బాధపడ్డడు.
తనూ ఇంత కాలం భయపడేది ఆ పరువు పోతుందనేనా? అప్పు ఇవాళ కాకుంటే రేపన్నా తీరుతుంది. పరువు పోతే?
“ఇంతకీ పట్నంల సేటు ఏమన్నాడయ్యా?”పూలమ్మ పిలుపుతో లేచి కూచున్నాడు నారాయణ.
మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు.
పట్నంల ఏం జరిగిందో చెప్పకుండానే అర్థమైపోయింది పూలమ్మకు. ఉన్న ఆశ కూడా జారిపోవడంతో కళ్లనిండా నీళ్లు తిరిగాయి. కానీ ఏడిస్తే భర్త గుండె పగులుతుందని కన్నీళ్లని కంటి రెప్పల చాటున దాచేసింది.
నిద్రపట్టింది నారాయణకు. కలత నిద్ర. కలల నిద్ర.
“పుల్లిగాని కొడుకు నారిగాని ఇల్లు వేలంపాట. ఒకటోసారి … రెండో సారి … మూడో సారి …”
కూలబడ్డాడు నారాయణ. పోయింది. ఇంత కాలం కాపాడుకున్న పరువు గంగల కలిసిపోయింది. ఇక బతకటం దండగ. అక్కన్నుంచి వేగంగా పరిగెత్తాడు, మర్రిచెట్టు కాడికి.
“రా, రా, రా,” ఊడలు పిలుస్తున్నాయ్.
జడల మర్రిచెట్టు. ఉరి తాళ్లు. గబ్బిలాలు.
అక్క. నర్సిగాడు. వాళ్ల పక్కనే వేలాడుతూ …
నారాయణ!
దిగ్గున మేలుకున్నాడు నారాయణ. కళ్లు తెరుచుకున్నాయి.
భార్య నిద్రపోతోంది. పక్కన కూతురు.
మంచంలోంచి లేచి కూచున్నాడు.
రా, రమ్మని పిలుస్తోంది ఊడల మర్రిచెట్టు.
పోలీసు వేధింపులు తట్టుకోలేక ఆ చెట్టుకే ఉరేసుకున్నాడు తాత.
అప్పు తీర్చలేక ఉరిపెట్టుకున్నాడు నాయన. నాకూ తప్పదా?
గబగబ లేచాడు. ఇంటి పైకప్పు సూరులో దాచుకున్న సారాయి సీసా బయటకు తీశాడు.
మొత్తం ఒక్క గుటకలో ఖాళీ చేశాడు.
చీకట్లో తడుముకుంటూ చప్పుడు కాకుండా మెల్లగా వెతికాడు. కాసేపటికి దొరికింది. మెల్లగా ఇంటి ముందు తలుపు తీసుకుని వేగంగా ఊరవతల ఊడల మర్రి చెట్టు వైపు నడిచాడు.
అదే చెట్టు. జడలు విరబోసుకున్న చెట్టు. ఊడలు చాచి పిలుస్తోంది.
వేగంగా చెట్టుదగ్గరికి చేరుకున్నాడు.
ఎవరన్నా వస్తున్నారేమోనని అటూ ఇటూ చూశాడు. చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి దండం పెట్టాడు.
“క్షమించు తల్లీ” అనుకున్నాడు.
********
భర్త మంచంలో లేకపోవడంతో పూలమ్మ ఉలిక్కిపడింది. ఎప్పుడో నిద్రపట్టిందో ఒళ్లు మరిచి నిద్రపోయింది. ఎంత సేపటికీ నారాయణ రాకపోయే సరికి కీడు శంకించింది. రెండు మూడు రోజుల నుంచి మొగడు తేడాగా కనిపించడం గమనిస్తూనే ఉంది. ఈ మనిషి ఏదో ఘోరం చేస్తాడని భయపడుతూనే ఉంది. ఇంత రాత్రిపూట ఎక్కడికి పోయాడు అనుకుంటూ లేచి ఇంటిబయటకొచ్చి అటూ ఇటూ చూసింది. “ఏమయ్యా,”అని కేకేసింది. జాడ లేదు. అంతే.
“వామ్మో, వాయ్యో … నా కొంపమునిగిందిరయ్యో. నేనేం చేద్దును దేవుడో,” అంటూ గట్టిగా ఏడుపందుకుంది. ఆ కేకలకు చుట్టు పట్టు జనం పరిగెత్తుకొచ్చారు. చీకట్లు పోయి అప్పుడే తెల్లారుతోంది. ఊరవతల ఊడల మర్రిచెట్టు గుర్తొచ్చింది పూలమ్మకి. అటు పరుగుతీసింది. వెంట జనం పరుగులు. కేకలు.
ఊపిరాపకుండా పరుగుతూ ఊరవతలకొచ్చి పడ్డారు జనం, పూలమ్మ.
ఊరవతల.
ఊడల మర్రి.
ఏదీ?
నిన్నటిదాకా జడలు విరబోసుకున్న చెట్టు ఇప్పుడు మొదలు దాకా నరకడంతో కుప్పకూలి పడిపోయి ఉంది.
పక్కన ... నారాయణ.
గండ్రగొడ్డలి చేతిలో పట్టుకుని బ్రహ్మరాక్షసిని వధించిన పరశురాముని లాగా చెట్టుమీద కాలువేసి నిలుచున్నాడు. ఒళ్లంతా చెమటలు.
“బస్సొచ్చే ఏళయింది. తొందరగా స్నానాలు చేసి పట్నం పోదాం. అక్కడే ఏదో ఓ పని చేసుకుని అప్పులు తీరుద్దాం,” అంటూ పూలమ్మను చూసి నవ్వాడు నారాయణ.
దూరంగా గుట్టల మధ్యనుంచి పొద్దు పొడిచింది.
స్పందించండి